న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే కోటి మందికి పైగా కరోనా టీకా వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. సోమవారం రోజు 1,00,96,142 మంది టీకా వేయించుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఒకే రోజు కోటి మందికి పైగా టీకా వేయించుకోవడం ఇది ఐదోసారి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్య మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 86 కోట్లు క్రాస్ అయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 35 లక్షల మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన రెండు కోట్ల మంది టీకా తీసుకుని రికార్డు సృష్టించారు. తొలిసారిగా ఆగస్టు 27వ తేదీన కోటి మంది టీకాలు తీసుకున్న విషయం తెలిసిందే.
అక్టోబర్ రెండో వారం వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టార్గెట్ను అక్టోబర్ 5 నుంచి 10వ తేదీ మధ్యలో చేరుకునే అవకాశం ఉంది. ఈ విజయాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అధిగమిస్తే.. దేశ వ్యాప్తంగా సంబురాలు నిర్వహించే అవకాశం ఉంది. కొవిడ్ వారియర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్తో పాటు హెల్త్కేర్ వర్కర్లను ఈ విజయోత్సవాల్లో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలుస్తోంది.
Congratulations to the nation, as we administer another 1 crore #COVID19 vaccine doses 👏
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 27, 2021
Under PM @NarendraModi ji, India delivers a punch to Corona – Record of 1+ crore vaccines achieved for the 5th time.#SabkoVaccineMuftVaccine pic.twitter.com/fQfVWoDAbR