న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్లో నెలకొన్న పరిస్థితులకు చైనానే కారణమని ఇవాళ ఇండియా మరో సారి స్పష్టం చేసింది. డ్రాగన్ దేశం రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తిస్తోందని, ఆ దేశ సైన్యం ఏకపక్షంగా ముందుకెళ్తోందని, సరిహద్దుల్లో శాంతి వాతావరణాన్ని నిర్వీర్యం చేస్తోందని చైనానే అని ఇండియా పేర్కొన్నది. విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ సరిహద్దు వద్ద చైనా నిరాటంకంగా బలగాలను మోహరిస్తోందన్నారు. చైనా చర్యలకు దీటుగానే భారతీయ దళాలు కౌంటర్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈస్ట్రన్ లడాఖ్లోని లైన్ ఆఫ్ యాక్టువల్ కంట్రోల్ వద్ద ఉన్న అన్ని సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం చైనా పనిచేస్తుందని ఆశిస్తున్నామని బాగ్చి తెలిపారు. సరిహద్దు ఉద్రిక్తతలకు భారత్ కారణమని తాజాగా చైనా ఆరోపించింది. చైనా భూభాగాన్ని ఇండియా ఆక్రమిస్తోందని, దూకుడు విధానంతో వెళ్తోందని డ్రాగన్ ఆదేశం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇండియా మరోసారి రియాక్ట్ అయ్యింది. చైనా చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, నిరాధార వ్యాఖ్యలకు ఇండియా బదులు ఇవ్వదని బాగ్చి చెప్పారు.