న్యూఢిల్లీ: 2023లో ఐదేండ్ల లోపు పిల్లల మరణాలు భారత్, నైజీరియాలోనే ఎక్కువని ప్లాస్ జర్నల్ అధ్యయనం వెల్లడించింది. మొత్తం ప్రపంచ వ్యాప్త మరణాల్లో మూడింట ఒక వంతు వాటా ఈ రెండు దేశాలదేనని పేర్కొన్నది. దాని ప్రకారం నైజీరియాలో 7.7 లక్షల మంది, భారత్లో 6.4 లక్షల మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. పెకింగ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం ప్రపంచం మొత్తం మీద 1990లో 1.29 కోట్లుగా ఉన్న ఈ తరహా మరణాలు 2023 నాటికి 47 లక్షలకు తగ్గాయి.
దాదాపు 63 శాతం తగ్గుదల నమోదైంది. ఐదేండ్ల లోపు పిల్లల మరణాల రేటు కూడా ఏటా సగటున 3.18 శాతం మేర తగ్గింది. 1990లో ప్రతి వెయ్యి జననాలకు 93.58 మరణాలు నమోదవగా… 2023 నాటికి అది ప్రతి వెయ్యి జననాలకు 36.72 మరణాలకు తగ్గింది. మరణాల రేటులో పురోగతి కనిపిస్తున్నా ఇప్పటికీ 58 దేశాలు ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (2030 నాటికి వెయ్యి జననాలకు 25 మరణాలు) చేరుకోలేకపోవచ్చని పరిశోధకులు అంచనా వేశారు.