NEW DRUGS LAW| న్యూఢిల్లీ: దేశంలో ఔషధాల తయారీ, దిగుమతి, విక్రయాల నియంత్రణకు కొత్త ఔషధ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. భారత్లో తయారైన దగ్గు మందుల కారణంగా గత ఏడాది గాంబియా, ఉజ్బెకిస్థాన్లో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఔషధాల నాణ్యత, భద్రత విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించేలా ఈ బిల్లును రూపొందించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం ఉన్న చట్టంలో ఎలాంటి మార్పులు తెస్తున్నారో మాత్రం వెల్లడించలేదు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే నూతన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. 41 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలలో ఒకటైన భారత్.. పాశ్చాత్య దేశాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలలో ప్రపంచ దేశాలకు ఔషధాలను సరఫరా చేస్తున్నది.