India-EU : ఇండియా-ఈయూ (యురోపియన్ యూనియన్) మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన ఈ ప్రకటన చేశారు. యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్, యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటోనియో లూయిస్తో కలిసి ఉమ్మడిగా మోదీ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
సోమవారమే దీనిపై ఒప్పందం కుదిరిందన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇండియా-ఈయూ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాన్ని నివారించడంలో సాయపడుతుందన్నారు. ఇది ఇండియా, యూరప్ ప్రజలకు అద్భుత అవకాశాలను కల్పిస్తుందని, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనపై మన నిబద్దతను మరింత బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు. ప్రపంచ జీడీపీలో ఇండియా-ఈయూ వ్యాపార భాగస్వామ్య వాటా 25 శాతం ఉందని పేర్కొన్నారు. ఇండియా-ఈయూ మధ్య 1962 నుంచి నుంచి వ్యాపార, వాణిజ్య ఒప్పందం కొనసాగింది. ఇది 2004 నుంచి వ్యూహాత్మకంగా మారింది. ఈ రెండు దశాబ్దాలలో ఎదురైన అనేక అవరోధాలకు తాజా ఒప్పందం చెక్ పెట్టబోతుంది. ఇప్పుడు కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయంగా కీలకంగా మారనుంది. ట్రంప్ టారిఫ్లు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్లను గందరగోళంలో నెట్టేశాయి.
ఈ సమయంలో ఇండియా-ఈయూ ఒప్పందం అంతర్జాతీయ వాణిజ్యానికి సానుకూల సంకేతాల్ని అందిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియాకు ఈయూ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ఈయూ-ఇండియా మధ్య 2024-25 మధ్య 136 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యాపారం జరిగింది. భారత తయారీ, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ వంటి రంగాల్లో ఈయూ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు భారత ఐటీ కంపెనీలు, ఫార్మా వంటి సంస్థలు యూరప్లో సేవలందిస్తున్నాయి.