Internet users : భారత టెలికామ్ రంగం (India’s Telicom Sector) అప్రతిహత వృద్ధిని కొనసాగిస్తోంది. దేశంలో ఇంటర్నెట్ (Internet), టెలిఫోన్ (Teliphone) వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. 2026 మార్చి నాటికి దేశంలో మొత్తం ఇంటర్నెట్ సబ్స్క్రైబర్ల సంఖ్య 109.27 కోట్లకు చేరింది. 2025 డిసెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 102.86 కోట్లుగా ఉండగా.. కేవలం మూడు నెలల్లోనే 6.24 శాతం వృద్ధి నమోదైంది.
ట్రాయ్ నివేదిక ప్రకారం.. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులలో 104.62 కోట్ల మంది వైర్లెస్ ద్వారా, 4.65 కోట్ల మంది వైర్డ్ కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందుతున్నారు. వీరిలో బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 106.58 కోట్లుగా ఉండగా.. న్యారోబ్యాండ్ (56 కేబీపీఎస్ కంటే తక్కువ వేగం) సబ్స్క్రైబర్లు 2.69 కోట్లుగా ఉన్నారు. త్రైమాసిక ప్రాతిపదికన బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్ల బేస్ 5.81 శాతం పెరగడం విశేషం. ఇంటర్నెట్తోపాటు మొత్తం టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య కూడా 133.05 కోట్లకు పెరిగింది.
దాంతో దేశవ్యాప్తంగా టెలి-డెన్సిటీ (ప్రతి 100 మందికి ఉన్న ఫోన్ కనెక్షన్లు) గత త్రైమాసికంలోని 91.74 శాతం నుంచి 93.26 శాతానికి మెరుగుపడింది. వైర్లైన్ టెలిడెన్సిటీ సైతం 3.33 శాతం నుంచి 3.38 శాతానికి పెరిగింది. వినియోగదారుల నుంచి వచ్చే సగటు నెలవారీ ఆదాయం కూడా టెలికామ్ సంస్థలకు సానుకూలంగా ఉంది. వైర్లెస్ సేవలకు సంబంధించి ఏఆర్పీయూ 0.76 శాతం పెరిగి రూ.196.04కి చేరింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇది 7.15 శాతం పెరుగుదల. అదేవిధంగా వినియోగ సమయం కూడా స్వల్పంగా పెరిగి నెలకు సగటున 1,017 నిమిషాలకు చేరింది.
టెలికామ్ రంగం వృద్ధి ప్రభుత్వ ఆదాయానికి కూడా ఊతమిచ్చింది. 2026 మార్చితో ముగిసిన త్రైమాసికంలో టెలికామ్ కంపెనీల నుంచి లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి రూ.6,936 కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ.6,733 కోట్లుగా ఉంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన 917 ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లు దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయని కూడా ట్రాయ్ తన నివేదికలో పేర్కొన్నది.