న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మూడో దశలో విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో మూడు వారాల వ్యవధిలోనే 50 లక్షలకుపైగా జనాభా కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో దేశంలో మొత్తం కేసులు నాలుగు కోట్ల మార్కును దాటాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన రెండో దేశంగా నిలిచింది. మొత్తం 7.3 కోట్ల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉన్నది. కాగా, రెండు రోజులపాటు తగ్గిన పాజిటివ్ కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 2.55 లక్ష కేసులు నమోదవగా, తాజాగా అవి 2.86 లక్షలకు చేరాయి.
2021, జూన్ 22న దేశంలో కరోనా కేసులు 3 కోట్ల మార్కును దాటాయి. కరోనా రెండో దశలో విజృంభిస్తున్న వేళ అత్యంత వేగంగా కోటి కేసులు కేసులు నమోదయ్యాయి. 2 నుంచి మూడు కోట్లకు చేరుకోవడానికి 40 రోజులు మాత్రమే పట్టింది. ఇక కరోనా మూడో వేవ్లో డిసెంబర్ చివరి వారం నుంచి కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. గత మంగళవారం ఒకే రోజు అత్యధికంగా 3.47 లక్షల కేసులు నమోదయ్యాయి.
కాగా, నిన్న ఒక్క కేరళలో 55,475 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగి 2.87 లక్షలకు చేరాయి. అదేవిఘంగా 571 మంది మరణించారు. దీంతో 2021, ఆగస్టు 25 తర్వాత ఒకేరోజు ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. ఆగస్టు 25న 603 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.