న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ జంతువుల్లోనూ మరణాలకు కారణమవుతున్నదని తెలిసింది. ఇటీవల గిర్ అడవుల్లోని ఆసియా సింహాల మృతికి కరోనా వైరస్ కారణమని తేలినట్టు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ ధ్రువీకరించింది. జంతువులలో ఒకదాని నుంచి మరొకదానికి కరోనా వ్యాపించేందుకు అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. తక్షణమే దేశంలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను మూసేయాలని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో సూచించింది. రక్షిత వనాలలో, ఇతర రక్షిత ప్రాంతాల్లోకి సందర్శకులను అనుమతించరాదని స్పష్టం చేసింది. మనుషుల నుంచి జంతువులకు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని పేర్కొన్నది. ఆరోగ్యశాఖ జారీచేసిన అన్ని జాగ్రత్త చర్యలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.