China | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: సరిహద్దు విషయంలో ఇప్పటికే కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. క్రీడా స్ఫూర్తిని కాలదన్నుతూ ఆసియా క్రీడలను వేదికగా చేసుకొన్నది. భారత్ నుంచి వెళ్లాల్సిన 10 మంది మార్షల్ ఆర్ట్స్ క్రీడా బృందంలోని ముగ్గురు అరుణాచల్ప్రదేశ్ క్రీడాకారులకు సంబంధింత అక్రిడిటేషన్ కార్డులు(వీసాలుగా పనిచేస్తాయి) జారీచేయకుండా వివక్ష చూపింది. దీంతో ఆ ముగ్గురు క్రీడాకారులు లేకుండానే బృందంలోని మిగతా వారు ఆసియన్ గేమ్స్లో పాల్గొనే నిమిత్తం చైనాలోని హాంగ్జౌకు వెళ్లాల్సి వచ్చింది. వాస్తవానికి శనివారం నుంచి ప్రారంభయ్యే ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అరుణాచల్కు చెందిన నేమన్స్ వాంగ్స్, ఒనిలు తేగా, మెపుంగ్ లాంగు కూడా హాంగ్జౌ వెళ్లాల్సి ఉన్నది. అయితే చైనా అధికారులు సంబంధింత క్లియరెన్స్లు ఇవ్వకపోవడంతో వారు ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇటీవల అరుణాచల్ప్రదేశ్ని కొన్ని ప్రాంతాలకు పేర్లు పెట్టడం, పలు భూభాగాలను డ్రాగన్ దేశం తన మ్యాప్లో చూపించి సరిహద్దు ఉద్రిక్తతలను మరింత రాజేసింది.
చైనా పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి
చైనా తీరును భారత్ తీవ్రంగా ఖండించింది. భారత క్రీడాకారులకు అక్రిడిటేషన్లు నిరాకరించడానికి నిరసనగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం తన చైనా పర్యటనను రద్దు చేసుకొన్నారు. చైనా చర్యలు వివక్షతో కూడుకొన్నవని, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ చైనాకు తన నిరసన తెలియజేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా భారత క్రీడాకారుల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నదని అన్నారు. నివాసం ఉంటున్న ప్రాంతం లేదా జాతి ఆధారంగా భారత పౌరుల పట్ల వివక్షతో వ్యవహరించడాన్ని భారత్ ఖండిస్తున్నదన్నారు. అరుణాచల్ప్రదేశ్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్ అంతర్గత భాగమేనని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ చైనా తాజా చర్యను ఖండిస్తున్నానన్నారు. చైనా చట్టవిరుద్ధ చర్యలపై దృష్టి సారించాలని ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీని కోరారు. కాగా, ముగ్గురు క్రీడాకారులకు అనుమతి నిరాకరణపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బీజింగ్లో మీడియాతో మాట్లాడుతూ అరుణాచల్ను తమ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. జంగ్నాన్ ఏరియా చైనా భూభాగమని చెప్పుకొచ్చారు.