India-Canada Row | కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలీవ్రే భారత్తో దౌత్యపరమైన వివాదంపై ప్రధాని జస్టిన్ ట్రూడోపై విమర్శలు గుప్పించారు. ‘నమస్తే రేడియో టొరెంటో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ట్రూడో నవ్వులపాలయ్యారన్నారు. 2025లో కెనడాలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రధాని పదవి రేసులో బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో కన్జర్వేటివ్ పార్టీ ముందున్నది.
ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే భారత్తో వృత్తిపరమైన సంబంధాలను పెంచుకుంటామన్నారు. విదేశాలతో సంబంధాలను చెడగొట్టారని ఆరోపించారు. ప్రపంచంలోనే ప్రధాన శక్తులతో పెద్ద వివాదాల్లో ఉన్నామని.. ఇందులో భారత్ కూడా ఉందన్నారు. భారత్తో కెనడాకు వృత్తిపరమైన సంబంధాలు అవసరమని, తాను ప్రధాని అయ్యాక సంబంధాలను పునరుద్ధరిస్తామన్నారు.
కెనడాలో చైనా జోక్యం చేసుకుంటుందని.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కెనడా ప్రధానితో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ట్రూడో ఎనిమిదేళ్ల పదవీకాలంలో ప్రతిష్ట మసకబారిందని విమర్శించారు. ఈ సందర్భంగా హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడంపై స్పందిస్తూ.. కన్జర్వేటివ్ పార్టీ హిందూ విలువలను పంచుకుంటుందన్నారు. ప్రజల విశ్వాసం మేరకు నిర్భయంగా ఆరాధించే స్వచ్ఛ ఉందన్నారు. హిందూ దేవాలయాలు, నేతలకు బెదిరింపులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడులకు పాల్పడ్డ వారిపై నేరారోపణలు మోపి చర్యలు తీసుకోవాలన్నారు.