INDIA Alliance | కోల్కతా, జనవరి 4: ‘ఇండియా’ కూటమిలోని విభేదాలు బెంగాల్లో మరోసారి వీధికెక్కాయి. కూటమి పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య లోక్సభ సీట్ల పంపకంపై చిచ్చు రేగింది. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో పొత్తులో భాగంగా కాంగ్రెస్కు తృణమూల్ 2 సీట్లను కేటాయించనున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై కాంగ్రెస్ భగ్గుమన్నది. తమ పార్టీకి సీఎం మమతా బెనర్జీ దయ అవసరం లేదని, సీట్ల కోసం తమ పార్టీ దేహీ అనదని, ఆమె ఇచ్చే దానికన్నా అక్కడ ఎక్కువ సీట్లే సొంతంగా పోటీ చేసి గెల్చుకుంటామని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి గురువారం పేర్కొన్నారు. తృణమూల్ అధ్యక్షురాలైన మమత అసలు ఉద్దేశం ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లడమని, అందుకే ఆమె ఈ రెండు సీట్ల ప్రతిపాదన తెచ్చారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అవసరం మమతకే ఎక్కువగా ఉందని, ఆ విషయం ఆమెకు కూడా తెలుసునన్నారు.
అధిర్ రంజన్ చౌదరి విమర్శలపై టీఎంసీ అధినాయకత్వం తీవ్రంగా స్పందించింది. నిత్యం చౌదరి, మరికొందరు నేతలు తమ పార్టీపై బురద జల్లుతూ పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ ఆరోపించారు. తాము కాంగ్రెస్కు రెండే సీట్లు ఇస్తామని ఆయనకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇండియా కూటమికి కన్వీనర్గా కాకుండా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని జేడీయూ మంత్రులు మదన్ సాహ్ని, రత్నేష్ సాదా గురువారం డిమాండ్ చేశారు. కూటమిలో తాను ఎలాంటి పెద్ద పదవిని ఆశించడం లేదని నితీశ్ ప్రకటించారని.. నితీశ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే కూటమిలోని అన్ని పార్టీలకు మేలు జరుగుతుందన్నారు.