న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ( Covid vaccination ) నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నది. మొదట్లో మందకొడిగా మొదలైన వ్యాక్సినేషన్ ఈ మధ్య కొంచెం స్పీడందుకుంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి శనివారం ఉదయం 7 గంటల వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 90.59 లక్షల డోసుల టీకాలు ఇచ్చారు. దాంతో దేశంలో ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకాల సంఖ్య 150 కోట్ల మార్కును దాటి 150.61 కోట్లకు చేరింది.
ఇక గడిచిన 24 గంటల్లో 40,895 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దాంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం రికవరీల సంఖ్య 3,44,12,740కి చేరింది. దాంతో రికవరీ రేటు 97.30 శాతంగా ఉన్నది. మరోవైపు ఇవాళ కొత్తగా 1,41,986 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం దేశంలో 4,72,169 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులలో ఇది 1.34 శాతంగా ఉన్నది.
అదేవిధంగా దేశంలో టెస్టింగ్ కెపాసిటీ కూడా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 15,29,948 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 68.84 కోట్ల కరోనా పరీక్షలు పూర్తయ్యాయి.