న్యూఢిల్లీ: ఇండియాలో ఆగస్ట్లో ఏకంగా 18 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. ఇది మొత్తం జీ7 దేశాలు అన్నీ కలిపి ఇచ్చిన దాని కంటే కూడా ఎక్కువని తెలిపింది. జీ7 దేశాలు (అమెరికా, జపాన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇటలీ) ఆగస్ట్లో 10.1 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. మరో ఘనత సాధించాం! ఆగస్ట్లో 18 కోట్ల వ్యాక్సిన్ డోసులతో ప్రపంచ పటంలో ఇండియా తనదైన ముద్ర వేసింది అని ప్రభుత్వ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.
జీ7 దేశాల్లో 4 కోట్ల వ్యాక్సిన్లతో జపాన్ టాప్లో ఉండగా.. కెనడా కేవలం 30 లక్షల వ్యాక్సిన్లతో చివరి స్థానంలో ఉండటం ఈ ట్వీట్లో చూడొచ్చు. అదే సమయంలో అమెరికాలో కేవలం 2.3 కోట్ల వ్యాక్సిన్ డోసులు మాత్రమే ఇచ్చారు. జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. మొత్తం 68.4 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.