న్యూఢిల్లీ : కరోనా ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు సంఖ్య పెరుగుతున్నాయన్న వార్తలు సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నాయి. చైనా సహా యూరప్లోని అనేక దేశాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక నగరాల్లో మళ్లీ లాక్డౌన్లు అమలులోకి వచ్చాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి అంతం కాలేదని అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 కేసులు పెరుగుతున్నాయని, అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పింది.
ఒమిక్రాన్ కంటే స్టెల్త్ వేరియంట్ తీవ్రమైందని, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నుంచి సులభంగా తప్పించుకునేలా ఉత్పరివర్తనాలను గుర్తించినట్లు పేర్కొంది. ఒమిక్రాన్ స్టెల్త్ వేరియంట్ బీఏ.2 వేరియంట్ను గతేడాది డిసెంబర్లో గుర్తించారు. సెల్యులార్ స్పైక్ ప్రొటీన్ నిర్మాణంలో తేడాలున్నాయని, గతంలో వచ్చిన వేరియంట్ల కన్న భిన్నంగా ఉంటుందని, వేరియంట్ను సులభంగా గుర్తించడం కష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త వేరియంట్ బారినపడితే కనిపించే లక్షణాలను పరిశోధకులు వివరించారు.
బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ (BHF) నివేదిక ప్రకారం.. కరోనా శ్వాసకోశ వ్యాధి. అయితే వైరస్ సోకిన వారు కూడా ఒమిక్రాన్ స్టెల్త్ వేరియంట్ కారణంగా గుండె సంబంధిత లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ శరీరంలోని ఇతర భాగాలను సైతం ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. హార్ట్ రేట్ పెరుగుల ఒమిక్రాన్ (BA.2) సోకిన వారిలో సాధారణ లక్షణంగా పరిగణించబడుతున్నది. అయితే, దీని పట్ల ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఇన్ఫ్లమేటరీ పరిస్థితుల పరితంగా గుండె వేగంగా కొట్టుకుంటుందని పలు అధ్యయనాలు గుర్తించారు.
ఈ పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ను ఎదుర్కొనేందుకు శరీరం అంతటా రక్తాన్ని పంప్ చేసేందుకు గుండె ఇంకా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. దీంతో హార్ట్ రేట్ సంబంధిత లక్షణాలు ఎదురయ్యే పరిస్థితులుంటాయి. అంతే కాదు.. కొంత మంది రోగులు కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత సైతం హార్ట్ రేట్ పెరిగినట్లు తెలిపారు. వైరస్ సోకిన వారికి మైకం, ఛాతిలో నొప్పి వచ్చినట్లయితే తక్షణం వైద్య సహాయం అవసరం అవుతుందని, ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలని బీహెచ్ఎఫ్ పరిశోధకులు పేర్కొన్నారు.
ఒమిక్రాన్ తరహాలోనే స్టెల్త్ వేరియంట్ లక్షణాలుంటాయని పరిశోధకులు పేర్కొన్నారు. వైరస్ సోకిన వారికి తుమ్ములు, అలసట, గొంతునొప్పి, కండరాలు, తలనొప్పి సమస్యలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. కొంతమందిలో చర్మంపై దద్దుర్లు, వాంతులు, మూర్ఛ, అధిక చెమట తదితర లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. అయితే, వేరియంట్ కారణంగా తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని తెలిపారు.
ప్రముఖ వైద్యుడు డాక్టర్ సౌరభ్ అవస్థీ మాట్లాడుతూ.. మూడో వేవ్ సమయంలో భారత్లో బీఏ.1 కేసులు నమోదయ్యాయని, స్టెల్త్ వేరియంట్ కేసులు ఎక్కువ నమోదు కాలేదన్నారు. ప్రస్తుతం వేరియంట్ ఇతరదేశాల్లో వేగంగా విస్తరించడం.. దేశంలోనూ ఆందోళన కలిగిస్తుందన్నారు. కరోనా నివారణకు ప్రజల్లంతా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొవిడ్ ప్రవర్తనా నియమావళిని కొనసాగించాలని సూచించారు.