కోల్కతా, జూన్ 12: పశ్చిమ బెంగాల్లో వచ్చే నెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. సోమవారం నామినేషన్లు వేయడానికి ప్రయత్నించిన పలువురిపై దాడులు జరిగాయి. పలు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఆయా నామినేషన్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. నామినేషన్ల సందర్భంగా ముఖ్యంగా బర్దమాన్ జిల్లా బార్షులీలో సీపీఐ (ఎం), టీఎంసీ వర్గాలు రాళ్లు, కర్రలతో కొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. అధికార టీఎంసీ నేతలు తన చేతిని విరగ్గొట్టారంటూ ఔష్గ్రామ్ అసెంబ్లీ పరిధికి చెందిన బీజేపీ నేత చంద్రనాథ్ బెనర్జీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘర్షణలపై తమకు పూర్తి వివరాలు అందజేయాలని ఎస్పీ, డీఎంలను ఆదేశించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలా ఉండగా, పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువును జూన్ 16 వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కలకత్తా హైకోర్టుకు తెలియజేసింది. పోలింగ్కు కేంద్ర సాయుధ బలగాలను దించేలా ఆదేశించాలంటూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఉద్యోగల సంఘాల జాయింట్ ఫోరమ్ కన్వీనర్ భాస్కర్ ఘోష్ మాట్లాడుతూ ఎన్నిక విధుల్లో ఉద్యోగుల రక్షణ కోసం తామీ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఒక ఉద్యోగిపై శనివారం దాడి జరిగిందని ఆయన తెలిపారు.