జలోర్, ఆగస్టు 15: దళిత బాలుడి ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బాధ్యతారహితంగా మాట్లాడారు. ఇటువంటి ఘటనలు అన్ని రాష్ర్టాల్లోనూ జరుగుతున్నాయని సోమవారం వ్యాఖ్యానించారు. ‘రోజూ టీవీ, పేపర్లలో ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం’ అన్నారు. ఇటువంటి ఘటనలపై ప్రజల్లో నమ్మకం కలిగేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. దళిత బాలుడి మరణం అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తు న్నాయని, పోలీసులు ఇప్పటికే టీచర్ను అరెస్టు చేశారని పేర్కొన్నారు.
ఇంతకంటే ఏం చేయాలి? అంటూ గెహ్లాట్ వ్యాఖ్యానించడంపై విమర్శలు వస్తున్నాయి. కుండలోని నీరు తాగాడని.. ఓ టీచర్ విచక్షణారహితంగా చితకబాదడంతో ఓ దళిత బాలుడు మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్లో జలోర్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకున్నది. రాష్ట్రంలో కొన్నేండ్లుగా దళితులపై దాడులు పెరిగాయని, దళితులకు న్యాయం చేయలేని పదవి తనకు వద్దంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పనాచంద్ మేఘ్వాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సీఎం అశోక్ గెహ్లాట్తో పాటు అసెంబ్లీ స్పీకర్కు కూడా పంపించారు.