Parliament | నమస్తే తెలంగాణ, న్యూఢిల్లీ, మే 25: కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ గురువారం సుప్రీం కోర్టులో ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశారు. ఈ నెల 28న జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా లోక్సభ సచివాలయం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ఆ లాయర్ పిల్లో పేర్కొన్నారు. లోక్సభ సచివాలయం వెలువరించిన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ ప్రకటనను ‘చట్ట విరుద్ధం, ఏక పక్షం, అన్యాయం, మోజు పడ్డ విధానం, అధికార దుర్వినియోగం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం’ అని పిల్ ఆక్షేపించింది. .
అభద్రత వల్లే అన్నింటినీ ఆయనే ప్రారంభిస్తున్నారు
వందే భారత్ రైలు మొదలుకొని కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వరకు అన్నింటినీ ప్రధాని మోదీనే ప్రారంభించాలనుకోవడం పాలకుల అభద్రతా భావాన్ని సూచిస్తున్నదని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వనం, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ఈ విషయంలో ప్రధాని తలబిరుసుతనం, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని విమర్శించారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ రాష్ట్రపతి చేత ఎందుకు చేయించకూడదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో ప్రశ్నించారు.
పార్లమెంట్ భారత రిపబ్లిక్ను ప్రతిబింబిస్తుందని, అలాంటి పార్లమెంట్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి లేకపోవడం మన గణతంత్ర విలువలను తగ్గిస్తుందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని మోదీ దూరదృష్టిని సూచిస్తున్నదని అమిత్ షా చెప్పడం మంచిదే..కానీ నిరుద్యోగం, ధరల పెరుగుదల, మహిళా రెజ్లర్ల ఆవేదన, ఆరోగ్యం, విద్యలో వెనుకబాటుతనం లాంటి సమస్యలపైనా ప్రధానికి దూర దృష్టి లేదా అని ఆయన ప్రశ్నించారు. గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్నప్పుడు అప్పటి లోక్సభ స్పీకర్ శివరాజ్పాటిల్ కొత్త పార్లమెంట్ భవనాన్ని 2026లోగా అందుబాటులోకి తెస్తే బాగుంటుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్న తనతో అన్నారని గుర్తు చేశారు. భవన నిర్మాణం గురించి తామిద్దరం ఆనాడు ప్రధానితో చర్చించామని తెలిపారు.
ఆదివాసీలకు అవమానం.. ధర్నా చేస్తాం
దేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతితో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించకుండా మోదీ ప్రభుత్వం గిరిజనులకు అవమానిస్తున్నదని ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ (ఏఐసీసీ) విమర్శించింది. ఇది ప్రజాస్వామ్యాన్ని కూడా అవమానించడమేనని ఆక్రోశం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ నేడు(శుక్రవారం) దేశ వ్యాప్త ఆందోళ చేస్తామని ప్రకటించింది.