అయోధ్యలో కొత్తగా నిర్మించిన ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానశ్రయాన్ని’ ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. రామమందిర ప్రారంభోత్సవం కోసం యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్నదని అన్నారు. తెలంగాణలో జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారక్క, నాగోబా జాతరల గురించి మోదీ ప్రస్తావించారు.
అయోధ్య : అయోధ్యలో కొత్తగా నిర్మించిన ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానశ్రయాన్ని’ ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సమ్మక్క సారక్క, నాగోబా జాతరల గురించి ప్రస్తావించారు. ఆధునికరించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను ప్రధాని ప్రారంభించారు. ఢిల్లీ నుంచి అయోధ్యకు బయల్దేరిన తొలి విమానంలో ప్రయాణికులు హనుమాన్ చాలీసా పఠించారు. శనివారం అయోధ్యలో పర్యటించిన మోదీ దాదాపు రూ.15 వేల కోట్లకుపైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రెండు అమృత్ భారత్ రైళ్లను, ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అయోధ్య విమానాశ్రయం నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్ షో నిర్వహించారు.
శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరుగుతుందని, ఆ రోజు రామాలయానికి రావాలని నిర్ణయించుకోవవద్దని.. ఆ తర్వాత ఎప్పుడైనా రావాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రతి ఒక్కరూ ఆ రోజు రాత్రి తమ ఇంట్లో దీపాలు వెలిగించాలని, దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ శనివారం అయోధ్యలో ప్రారంభించిన అయోధ్య-దర్భంగ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలులో సుమారు 1,200 మంది ఉచిత సావనీర్ పాస్ హోల్డర్లు ప్రయాణించారు. వీరిలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెట్టిన మొట్టమొదటి విమానంలో ప్రయాణికులు హనుమాన్ చాలీసాను పారాయణ చేశారు. ఈ విమానం శనివారం ఢిల్లీ నుంచి బయల్దేరింది. ప్రయాణికులు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ, విమానం ఎక్కారు.
శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రసాదంగా వినియోగించడం కోసం ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు 300 మెట్రిక్ టన్నుల సుగంధ బియ్యాన్ని అయోధ్యకు శనివారం పంపించారు. ఛత్తీస్గఢ్ ప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈ బియ్యాన్ని ఆలయానికి సమర్పించింది.
రామాలయం ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాజకీయం చేస్తున్నదనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ శనివారం ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, “ఇప్పుడు ఇక మిగిలిన విషయం ఒకటే, అదేమిటంటే, ఎన్నికల్లో తమ అభ్యర్థి శ్రీరాముడు అని బీజేపీ ప్రకటించడమే. శ్రీరాముడి పేరు మీద అతిగా రాజకీయాలు జరుగుతున్నాయి” అన్నారు.