కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఒక వ్యక్తి అనుచిత ఈమెయిల్స్ పంపుతున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేసి చివరకు అతడ్ని అరెస్ట్ చేశారు. సీఎం మమతా బెనర్జీతోపాటు ఆ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులకు గత కొన్ని రోజులుగా అనుచిత ఈమెయిల్స్ వస్తున్నాయి. అసభ్య, అభ్యంతరకర కంటెంట్, గ్రాఫిక్స్తో కూడిన ఈమెయిల్స్ను ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ భాషల్లో పంపుతున్నారు. కొంత మంది వ్యక్తులను కీటకాలుగా పరిగణించాలని, పురుగు మందుల ద్వారా వారిని అంతం చేయాలని సీఎం మమతను కోరారు. అలాగే మరణం, విధ్వంసానికి సంబంధించిన సమాచారం కూడా ఆ మెయిల్స్లో ఉన్నాయి. వేర్వేరు ఈమెయిల్ ఐడీల ద్వారా వీటిని పంపుతున్నారు. ఫ్యాట్ బో, స్లిమ్ బాయ్, డెత్ గోస్ట్.. వంటి అనేక యూజర్ల పేర్లతో ఈమెయిల్స్ వస్తున్నాయి.
కాగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు. స్విట్జర్లాండ్లోని ప్రోటాన్ మెయిల్ సర్వీస్ ద్వారా ఎన్క్రిప్టెడ్ విధానంలో ఈమెయిల్స్ పంపుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అనుచిత మెయిల్స్ పంపుతున్న వ్యక్తిని గుర్తించడానికి పోలీసులు చాలా శ్రమించారు. చివరకు దీపంజన్ మిత్ర అనే నిందితుడ్ని గత వారం డార్జిలింగ్లోని అతడి ఇంట్లో అరెస్ట్ చేశారు. అతడు వినియోగించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్, డిజిటల్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడ్ని ఆదివారం సిలిగురి కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సోమవారం కోల్కతాకు అతడ్ని తీసుకొచ్చారు. సీఎం మమతా బెనర్జీతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులకు అతడు పంపిన అనుచిత ఈమెయిల్స్ గురించి ప్రశ్నిస్తున్నారు.