చెన్నై: మహిళల భద్రతపై జరిగిన ఓ నిరసన ర్యాలీలో పాల్గొన్న ఏఐఏడీఎంకే ఎంపీ ఒకరు సినీ నటి నయనతారను ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ని ఎద్దేవా చేసేందుకు నయనతారను ఎంపీ ప్రస్తావించడం వివాదాస్పదమైంది. స్టాలిన్ ఇటీవల తమ కలలను ప్రభుత్వంతో పంచుకోవాలని, వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుందని ప్రజలకు పిలుపునిచ్చారు. తమిళనాడులో మహిళలకు భద్రత, గౌరవం పెరగాలని డిమాండ్ చేస్తూ ఏఐఏడీఎంకే ఆధ్వర్యంలో మంగళవారం చెన్నైలో ఓ ర్యాలీ జరిగింది. ఇందులో పాల్గొన్న ఆ పార్టీ ఎంపీ సీవీ షణ్ముగం మాట్లాడుతూ మన సీఎం మన కలలను పంచుకొమ్మని చెప్పారు. నాకు నయనతార కావాలని చెబితే ఆయన(స్టాలిన్) నా కలను తీరుస్తారా? నయనతారతో నాకు పెండ్లి చేయించమని ఎవరైనా అడిగితే ఆయన ఆ కలను నెరవేరుస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ఎంపీ వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.