ముంబై, జనవరి 31: విమానాల్లో అనుచిత ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఇటలీకి చెందిన పాయ్లా పెర్రుక్కియో అనే ప్రయాణికురాలు విస్తారా విమానంలో అనుచితంగా ప్రవర్తించింది. సోమవారం అబుదాబి నుంచి ముంబైకి వచ్చిన విమానంలో ఈ ఘటన జరిగింది. ఎకానమీ క్లాస్లో కూర్చోవాల్సిన ఆమె విమానం బయల్దేరిన తర్వాత బిజినెస్ క్లాస్లోకి మారింది. ప్రశ్నించిన విమాన ఉద్యోగినిపై కోపంతో దాడి చేసింది. అర్ధనగ్నంగా నడక మార్గంలో తిరిగింది. వెంటనే విమాన సిబ్బంది ఆమెను నియంత్రించి సీట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా ఆమె వారిని బూతులు తిట్టింది. విమానం ముంబై చేరుకోగానే ఆమెను పోలీసులకు అప్పగించారు.