న్యూఢిల్లీ: హింసాత్మక సంఘటనలతో రగులుతున్న మణిపూర్లో లోక్సభ ఎన్నికల నిర్వహణ గురించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ మాట్లాడారు. శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు అక్కడి నుంచే ఓటు వేసేందుకు అనుమతిస్తామని చెప్పారు. (Lok Sabha Elections 2024) మణిపూర్ గురించి మీడియా ప్రతినిధి అడిగిన ఒక ప్రశ్నకు రాజీవ్ కుమార్ సమాధానం ఇచ్చారు. శిబిరాల్లో ఉన్న ప్రజలు ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ‘మేం ఒక ప్రణాళిక రూపొందించాం. దాని గురించి వెల్లడిస్తాం. శిబిరంలో ఉన్న ఓటర్లు అక్కడి నుంచే ఓటు వేయడానికి అనుమతిస్తాం. జమ్ముకశ్మీర్లో వలసదారుల కోసం ఒక పథకం ఉన్నట్లే, మణిపూర్లో కూడా అదే విధంగా పథకం అమలు చేస్తాం. అన్ని నియోజక వర్గాల ఓటర్లు సంబంధిత శిబిరాల నుంచి ఓటు వేసేందుకు అనుమతి ఉంటుంది’ అని అన్నారు. అలాగే శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గోవాలని మణిపూర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కాగా, మణిపూర్లో గత ఏడాది మే నుంచి మెజారిటీ మైతీ, గిరిజన కుకీ వర్గాల మధ్య జాతి ఘర్షణలు జరుగుతున్నాయి. హింసాత్మక సంఘటనల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. 25,000 మందికిపైగా ప్రజలను భద్రతా సిబ్బంది రక్షించారు. నిరాశ్రయులైన 50,000 వేల మందికిపైగా ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో జీవిస్తున్నారు.