లక్నో, సెప్టెంబర్ 26: యువత భవిష్యత్తుతో యోగి సర్కారు ఆటలాడుతున్నది. పరీక్షల నిర్వహణలో యూపీ ప్రభుత్వం ఘోర వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో చేపట్టిన కొద్ది ఉద్యోగాల భర్తీని కూడా బీజేపీ ప్రభుత్వం సక్రమంగా చేయలేకపోయింది. ప్రశ్నపత్రాల లీకులు, కోర్టుల కేసులతో అపఖ్యాతి పాలైంది. యోగి సీఎంగా చేసిన మొదటి టర్మ్లో 2017-22లో అనేకమార్లు ప్రశ్నప్రతాలు లీక్ అయ్యాయి. పలు నియామక ప్రక్రియలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కోర్టు కేసుల సంఖ్య భారీగానే ఉన్నది. ఈ ఏడాది మార్చిలో యూపీలో వరుసగా రెండో విడత అధికారం చేపట్టిన బీజేపీ.. జూలై 31న నిర్వహించిన యూపీ లేఖ్పాల్(రెవెన్యూ విభాగంలో ఉద్యోగాలు) పరీక్ష ప్రశ్నపత్రం లీకుతో మళ్లీ అదే ట్రెండ్ కొనసాగుతున్నది.
ఇక ఆ పరీక్ష సంగతేంటో..?
ప్రశ్నపత్రాల లీక్ జరుగలేదని ప్రభుత్వం గంభీరంగా చెబుతున్నప్పటికీ.. ఉద్యోగార్థులు బీజేపీ ప్రభుత్వ లీకుల బండారాన్ని బయటపెడుతున్నారు. అభ్యర్థులకు బ్లూటూత్ పరికరాల ద్వారా కొంత మంది అధికారులే సాయం చేశారని పలు పరీక్షా కేంద్రాల్లో ఉద్యోగార్థులు ఆరోపించారు. పరీక్ష తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాన్పూర్, ప్రయాగ్రాజ్, బరేలీ జిల్లాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) పేపర్ లీకు గ్యాంగ్లను అరెస్టు చేసింది. 8,085 పోస్టుల కోసం 2.5 లక్షల మంది హాజరైన లేఖ్పాల్ పరీక్ష నిర్వహణలోనే విఫలమైన ప్రభుత్వం ముందు వచ్చే నెల 15,16 తేదీల్లో జరుగనున్న యూపీఎస్ఎస్ఎస్సీ ప్రాథమిక పరీక్ష సవాల్గా మారింది.
భారీగా లీకుల పర్వం..
యోగి ఆదిత్యనాధ్ మొదటి టర్మ్ (2017-22)లో అర డజనుకు పైగా ప్రశ్నపత్రాల లీకేజీ, ఫలితంగా పరీక్షల రద్దు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
జూలై 2017: యూపీ సబ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ ప్రశ్నపత్రం వాట్సాప్లో లీక్ అయింది. ఇందులో ప్రమేయం ఉన్న ఏడుగురిని ఎస్టీఎఫ్ అరెస్టు చేసింది. పరీక్షా కేంద్రాల్లోని కంప్యూటర్లలో రిమోట్ యాక్సెస్ ఇన్స్టాల్ చేసేందుకు నిందితులు రూ.10 లక్షలు వసూలు చేశారని దర్యాప్తులో తేలింది.
ఫిబ్రవరి 2018: యూపీపీసీఎల్(ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్) జూనియర్ ఇంజినీర్స్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్. దీనికి సంబంధించి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎస్టీఎఫ్ 12 మందిని అరెస్టు చేసింది.
సెప్టెంబర్ 2018: బోరుపంపుల ఆపరేటర్ల కోసం నిర్వహించిన ప్రశ్నపత్రం లీకైన ఘటనలో మీరట్లో అధికారులు 11మంది నిందితులను అరెస్టు చేశారు.
నవంబర్ 2020: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పేపర్ లీకవడంతో పరీక్ష రద్దయింది.
జనవరి 2021: సీటీఈటీ పేపర్ లీకేజీ ఘటనలో ఐదుగురు అరెస్టు
నవంబర్ 2021: యూపీటీఈటీ(ఉత్తరప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు) పేపర్ లీక్