న్యూఢిల్లీ: త్విషా శర్మ(Twisha Sharma) మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటన చాలా బాధాకరంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఆ కేసు అంశంలో మీడియా సంయమనంతో వ్యవహరించాలని కోర్టు చెప్పింది. మాజీ మోడల్ త్విషా శర్మ మృతి కేసులో జరుగుతున్న పరిణామాలను రిపోర్టింగ్ చేసే సమయంలో మీడియా ఓపికతో ఉండాలని కోర్టు తెలిపింది. భోపాల్లోని కటారా హిల్స్లో ఉన్న అత్తారింట్లో మే 12వ తేదీ త్విషా శర్మ ఉరివేసుకున్నది. వరకట్న వేధింపులు, సూసైడ్కు ప్రేరేపించడం వల్లే త్విషా మరణించినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఆమె భర్త సమర్థ్ సింగ్ ఓ లాయర్. అత్త గిరిబాలా సింగ్ మాజీ జడ్జీ. అయితే వారిద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్విషా కేసులో దర్యాప్తు వ్యక్తిగతంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని సీజే సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. కొన్ని చర్యలు చాలా బాధాకరంగా ఉన్నాయని, బాధిత కుటుంబం కానీ ఇతర వ్యక్తుల వాంగ్మూలం అంశంలోనూ మీడియా మిత్రులు సంయమనంతో ఉండాలని కోర్టు తెలిపింది. చట్టం ప్రకారం విచారణ జరుగుతుందన్నారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఇలాంటి దురదృష్టకర పరిస్థితిని ఎదుర్కొనడం కన్నా.. విడాకులు తీసుకున్న కూతురు ఉన్నా బెటర్ అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐ తర్వలో దర్యాప్తు చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.