న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగం నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. కేవలం మన దేశం మాత్రమే కాదు.. యావత్ ప్రపంచ దేశాలు కూడా మన బడ్జెట్పై దృష్టి పెట్టినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ ఆర్ధిక అంశాలపై విశ్వసనీయమైన సంస్థలు కొన్ని పాజిటివ్ సందేశాలు చేశాయన్నారు. తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మహిళా రాష్ట్రపతి ప్రసంగం చేయనున్నట్లు ప్రధాని తెలిపారు.
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి తొలి ప్రసంగం చేయడం మన రాజ్యాంగానికి గర్వకారణ క్షణాలని, ఇది మహిళలకు దక్కుతున్న గౌరవం అని, ఇండియాపైనే ప్రపంచ దృష్టి ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మన ఆర్ధిక మంత్రి కూడా మహిళే అని, రేపు ఆ మంత్రి దేశం ముందు బడ్జెట్ను ప్రవేశపెడుతారని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిణామాల దృష్ట్యా.. ఇండియానే కాదు, యావత్ ప్రపంచ దేశాలు మన బడ్జెట్పై దృష్టి పెట్టినట్లు మోదీ తెలిపారు.
ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్ అన్న ఆలోచనా విధానాన్ని బడ్జెట్ సమావేశాల ద్వారా ముందుకు తీసుకువెళ్లనున్నట్లు మోదీ చెప్పారు. పార్లమెంట్ ముందు విపక్ష నేతలు కూడా తమ అభిప్రాయాలు వెల్లడిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉందని, సాధారణ ప్రజల ఆశయాలు, ఆశలకు తగినట్లు బడ్జెట్ ఉంటుందని, ఆ ఆశయాలకు తీసిపోని విధంగా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.