Road Accidents | కేంద్ర రోడ్డు రవాణాశాఖ 2022 జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య 94వేలకుపైగా ప్రమాదాలు రికార్డయ్యాయి. ఈ సమయంలో జరిగిన ప్రమాదాలు దేశంలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో 20శాతానికిపైగా ఉన్నాయి. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల అత్యల్పంగా ప్రమాదాలు నమోదయ్యాయని నివేదిక తెలిపింది. 2022 సంవత్సరంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య 94,009 రోడ్డు ప్రమాదాలు రికార్డయ్యాయి.
కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను కలుపుకొని మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఇందులో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘటనలో 4,43,366 మంది గాయపడ్డారు. నివేదిక ప్రకారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సమయంలో 79,639 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. 2022లో దాదాపు సగం రాష్ట్రాల్లో మరణాల రేటు జాతీయ సగటు 5.2 కంటే ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు 74,897 మంది ప్రాణాలు కోల్పోగా.. 2021 కంటే 7.9 శాతం ఎక్కువ ఉన్నది. 2022లో 19.5 శాతం వాటాతో పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా బాధితులుగా ఉన్నట్లు నివేదిక వివరించింది.