ఇంఫాల్: మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో (Manipur) భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా మూడు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించారు. కాంగ్పోక్పి జిల్లాలోని లోచింగ్ రిడ్జ్లో భారీగా ఆయుధాలను శుక్రవారం కనుగొన్నారు. 303 రైఫిల్స్, మ్యాగజైన్తో కూడిన ఒక 9 ఎంఎం పిస్టల్, క్యాట్రిడ్జ్లు, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు డిటోనేటర్లు, దేశంలో తయారు చేసిన మోర్టార్, లాంగ్ రేంజ్ ఇంప్రూవైజ్డ్ మోర్టార్ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, తౌబల్ జిల్లాలోని ఫైనోమ్ కొండ ప్రాంతంలో నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు ‘పంపి’ షెల్స్, మూడు డిటోనేటర్లు, స్టన్ గ్రెనేడ్, స్టింగర్ గ్రెనేడ్, టియర్ గ్యాస్ షెల్ను మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్ బృందం స్వాధీనం చేసుకున్నది. అలాగే బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్తో కలిసి మణిపూర్ పోలీసులు చురచంద్పూర్ జిల్లాలోని గోథోల్ గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. స్థానికంగా ‘పంపి’ అని పిలిచే రెండు అధునాతన మోర్టార్లను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు శుక్రవారం భద్రతా బలగాలు జరిపిన సెర్చ్, ఏరియా డామినేషన్ విన్యాసాల సందర్భంగా ఈ మేరకు భారీగా ఆయుధాలను కొనుగొని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీస్ అధికారులు వెల్లడించారు. మణిపూర్లో గత ఏడాది మే నుంచి మైతీ, కుకీ జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 200 మందికిపైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.