ముంబై: మహారాష్ట్రలోని మాలేగావ్లో 2008లో జరిగిన పేలుళ్ల కేసులో నిందితురాలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కు (Pragya Singh Thakur) ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం వారెంట్ జారీ చేసింది. విచారణ కోసం కోర్టుకు ఆమె హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు హాజరు కాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని గత నెలలో కోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి ఏకే లహోటి సోమవారం ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్పై రూ.10,000 విలువైన బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. మార్చి 20లోగా నివేదిక సమర్పించాలని దర్యాప్తు సంస్థను ఆదేశించారు.
కాగా, 2008 సెప్టెంబర్ 29న మాలేగావ్లోని మసీదు సమీపంలో జరిగిన బాంబ్ పేలుళ్లలో ఆరుగురు వ్యక్తులు మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ 2011లో ఎన్ఐఏకు బదిలీ చేసింది. బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్తోపాటు మరో ఆరుగురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.