Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, విద్యుత్తు కోతలే కాదు.. కరెంటు షాకులు కూడా తగులుతాయి. మొన్నటికి మొన్న అధికారంలోకి వచ్చిన కర్ణాటకతోపాటు హస్తంపార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో విద్యుత్తు బిల్లులపై చార్జీల పెంపే దీనికి నిదర్శనం
గృహ, వ్యవసాయ, పరిశ్రమలకు తగినంత విద్యుత్తు సరఫరా చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కరెంటు కోతలకు తెగబడుతున్నది. సరఫరా చేసే ఆ కొంత కరెంటుపై కూడా కాంగ్రెస్ సర్కారు ఎడాపెడా బిల్లుల మోత మోగిస్తున్నది. ఎక్స్ట్రా ఫ్యూయెల్ అడ్జస్ట్మెంట్ కాస్ట్ (ఎఫ్ఏసీ) పేరిట యూనిట్కు 85 పైసలను సర్కారు ఇటీవలే అదనంగా పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలను కూడా విడిచిపెట్టలేదు. మూడేండ్లకుగానూ స్పెషల్ పవర్ టారిఫ్ను తీసుకొస్తున్నట్టు పారిశ్రామికవేత్తలకు సర్కారు తాజాగా షాక్ ఇచ్చింది. కరెంటు బిల్లులపై వినియోగదారులకు కచ్చితమైన అవగాహన ఉండటానికే మల్టీ-ఇయర్-టారిఫ్స్ (ఎంవైటీ)ని తీసుకొచ్చినట్టు కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (కేఈఆర్సీ) వెల్లడించింది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై కర్ణాటక చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ (ఎఫ్కేసీసీఐ) మండిపడింది. దేశంలోని మిగతా రాష్ర్టాలు ఎంవైటీ విధానాన్ని తీసుకురాకముందే, ఎలాంటి అధ్యయనం చేయకుండానే కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా నిర్ణయం పరిశ్రమలకు పెను భారమేనని ఆందోళన వ్యక్తం చేసింది.
అధికారంలోకి వస్తే, 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామంటూ హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ హామీనిచ్చింది. ఉచిత విద్యుత్తు మాట ఏమోగానీ, వచ్చీరాగానే గత ఫిబ్రవరిలో విద్యుత్తు చార్జీలను యూనిట్కు 86 పైసల మేర పెంచింది. తిరిగి ఏప్రిల్లో మరో 22 పైసలు వాతపెట్టింది. ఇక, రాజస్థాన్లో గత ఏప్రిల్లో రెండు విడుతల్లో యూనిట్కు ఏకంగా 75 పైసల చొప్పున చార్జీలు పెంచింది. దీంతో గతంలో రూ. 200 వచ్చే కరెంటు బిల్లులు రూ. 600 కంటే ఎక్కువ వస్తున్నట్టు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో పగ్గాలు చేపట్టిన తర్వాత 2021లో 6.19 శాతం మేర పవర్ టారిఫ్ను పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కిందటేడాది ఏప్రిల్లో మరో 2.31 శాతం మేర టారిఫ్ను పెంచింది. దీంతో విద్యుత్తు బిల్లులు డబుల్ వస్తున్నాయని సామాన్యులు మండిపడుతున్నారు.
తెలంగాణతో పోల్చితే కర్ణాటకలో విద్యుత్తు బిల్లులను రెండింతలు ఎక్కువ వసూలు చేస్తున్నారని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఉదాహరణకు కర్ణాటకలో ఒక వినియోగదారుడు గృహ అవసరాలకు 3కిలోవాట్ల లోడ్తో 163 యూనిట్ల కరెంటు కాలుస్తే వివిధ పన్నులు కలుపుకుని వచ్చే బిల్లు రూ. 1544 కాగా అదే తెలంగాణలో కేవలం రూ.713 వసూలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రెండు బిల్లుల కాపీలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.