జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Rajasthan Assembly Counting) ఒక ‘శివ భక్తుడు’ కేంద్ర మంత్రికి షాక్ ఇచ్చాడు. జోత్వారా నియోజకవర్గంలో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సింగ్పై కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరి పోటీ చేశాడు. అయితే ‘శివ భక్తుడు’గా ప్రాచుర్యం పొందిన కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సుమారు 20,000 ఓట్ల మెజార్టీతో లీడ్లో ఉన్నాడు. 33 ఏళ్ల వయసున్న ఆయన రాజస్థాన్లోని ఫలోడికి చెందిన వ్యక్తి. వ్యవసాయ కుటుంబానికి చెందిన అభిషేక్ చౌదరి, తనకు రూ.48 లక్షల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు. కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ రాజస్థాన్ ప్రతినిధిగా చెప్పుకునే అభిషేక్ చౌదరి, తాను శివభక్తుడినని చెప్పుకునేవాడు. అలాగే మహిళా విద్య కోసం కృషి చేసినట్లు వెల్లడించాడు.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో జోత్వారా స్థానంలో బీజేపీ తరుఫున రాజ్పాల్ సింగ్ షెఖావత్ పోటీ చేశారు. అయితే ఈ సారి ఆ స్థానంలో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ను ఆ పార్టీ పోటీలో నిలిపింది. ఆయన గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరి తరుఫున ఆ పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్ ఎవరూ ప్రచారం చేయలేదు. అయినప్పటికీ కౌంటింగ్లో ఆయన ముందంజలో నిలిచాడు.