Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్ లో పోలీసులు కీలకమైన ఆపరేషన్ మొదలుపెట్టారు. తీవ్రవాదానికి అడ్డాగా మారిన ఈ ప్రాంతంలో మసీదుల్ని జల్లెడ పడుతున్నారు. ప్రతి మసీదుకు వెళ్లి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం నాలుగు పేజీల ఫాంలు రెడీ చేశారు. మసీదుల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఈ డాక్యుమెంట్ నింపాల్సి ఉంటుంది. మసీదు వివరాల కోసం 4 పేజీల డాక్యుమెంట్, వ్యక్తిగత వివరాల కోసం మూడు పేజీల మరో డాక్యుమెంట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది.
పోలీసులు ఇలాంటి ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి. మసీదులు నిర్వహించే ఇమామ్ ల దగ్గరి నుంచి ముయెజ్జిన్ , ఖతీబ్స్, బైట్ ఉల్ మాల్ వంటి వారి వివరాలు సేకరిస్తున్నారు. అంటే అక్కడ మసీదు పెద్దతోపాటు, ప్రార్థనలు చేయించే వారు, సేవా కార్యక్రమాలు చూసే వారితోపాటు అక్కడికి వచ్చే వారి సంఖ్య, వారి పేర్లు, ఇతర వివరాల్ని కూడా నమోదు చేసుకుంటున్నారు. ఈ డాక్యుమెంట్లలో మసీదు ఎప్పుడు కట్టారు.. ఎన్ని ఫ్లోర్లు.. వైశాల్యం.. ఆదాయ వనరులు.. నిధులు.. ల్యాండ్ టైప్.. బ్యాంకు వివరాలు.. దాతల వివరాలు.. ఖర్చులు.. అక్కడ సాగించే కార్యకలాపాలు.. టైమింగ్స్ తోపాటు మసీదు నిర్వహించే వారు, ఇతర సిబ్బందికి సంబంధించిన పేర్లు, ఫోన్ నెంబర్లు, వారి బ్యాంక్ డీటైల్స్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్ పోర్ట్, వాడే మొబైల్ మోడల్, ఐఎంఈఐ నెంబర్లు, ఈ మెయిల్, ట్రావెల్ హిస్టరీ, బర్త్ డేట్, ఆదాయ వివరాలు, ఏటీఎం, క్రెడిట్, రేషన్ కార్డులు, మసీదుల విలువ, అనుమతులు వంటివన్నీ సేకరిస్తున్నారు.
దీని ద్వారా ఇక్కడి అసాంఘిక, తీవ్రవాద కార్యకలాపాల్ని అడ్డుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని వ్యక్తుల కదలికలపై పూర్తి నిఘా పెట్టేందుకు వీలుంటుంది. అయితే, కాశ్మీర్ లోయలో ఇలా వివరాలు సేకరించడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమపై ఏమైనా అనుమానాలుంటే బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు కానీ.. ఇలా తమతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకుని, బహిరంగ పర్చడం సరికాదని కొందరు అంటున్నారు. అయితే, పోలీసులు ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.