చండీగఢ్: అక్కడి కార్పొరేట్ కార్యాలయాల్లో (Corporate Offices) ఇకపై బీర్, వైన్ సర్వ్ చేయనున్నారు. కంపెనీ ఉద్యోగుల కోసం వీటిని అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది. బీజేపీ పాలిత హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్కువ ఆల్కహాల్ కలిగిన వైన్, బీర్ వంటివి కార్పొరేట్ కార్యాలయాల్లో సర్వ్ చేయవచ్చని తెలిపింది. అయితే దీని కోసం 2000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న క్యాంటీన్ లేదా ఈటరీని కార్పొరేట్ ఆఫీసుల్లో ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు కొత్త ఎక్సైజ్ పాలసీకి హర్యానా క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. దేశీయ, విదేశీ మద్యంపై ఎక్సైజ్ సుంకం రేట్లను స్వల్పంగా పెంచింది. తద్వారా రూ.400 కోట్ల ఆదాయాన్ని గడించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ నిధులను పర్యావరణం, గో సేవ వంటి జంతు సంక్షేమానికి వినియోగిస్తామని పేర్కొంది.
కాగా, తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలను ప్రోత్సహించేందుకు మైల్డ్, సూపర్ మైల్డ్ కేటగిరీలకు చెందిన పానీయాలు, బీర్లపై ఎక్సైజ్ సుంకాన్ని హర్యానా ప్రభుత్వం తగ్గించింది. అలాగే బీర్, వైన్ వినియోగం మాత్రమే ఉండే పబ్ కేటగిరీ లైసెన్స్ ఫీజును మరింత తగ్గించారు. అయితే పంచకులలోని శ్రీ మాతా మానస దేవి ఆలయం చుట్టూ నోటిఫై చేసిన పవిత్ర ప్రాంతాలు, గురుకులాలున్న గ్రామాల్లో మద్యం షాపులు ఉండకూడదని కొత్త ఎక్సైజ్ పాలసీలో పేర్కొన్నారు.