న్యూఢిల్లీ, మార్చి 28: అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. హిండెన్బర్గ్ అంశంపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపడితే దొరికిపోయేది మోదీయేనని, అదానీ కాదని అన్నారు. ఎందుకంటే.. మోదీయే అసలైన పెట్టుబడిదారుడు అని, మనకు ముందుకు కనిపించేది మాత్రం అదానీ అని ఆరోపించారు. ‘ప్రధాని మోదీ ఎవ్వరికీ ఏం చేయలేదు. అలాంటప్పుడు తన దోస్త్ అదానీకే ఎందుకు చేస్తున్నారు? దీన్ని బట్టే మోదీయే అసలుసిసలైన పెట్టుబడిదారుడు అని అర్థం చేసుకోవచ్చు’ అని విమర్శించారు. ‘మోదీ.. శ్రీలంకపై ఒత్తిడి పెంచి పవన విద్యుత్తు ప్రాజెక్టు అదానీకి అప్పగించేలా చేశారు. రెండేండ్ల క్రితం ఎయిర్పోర్టులను ప్రైవేటీకరించారు. చివరి నిమిషంలో నిబంధనలు మార్చి ఆరు ఎయిర్పోర్టులను అదానీకి అప్పగించారు. అవి అందింది అదానీకి కాదు మోదీకే. ఎయిర్పోర్టుల బిజినెస్లో 30 శాతం వాటా మోదీదే’ అని పేర్కొన్నారు.