Gujarat | పలన్పూర్, జూన్ 1: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అగ్రవర్ణాల దాష్టీకానికి అమాయక దళితులు బలవుతూనే ఉన్నారు. మంచి దుస్తులు ధరించినా, అందంగా తయారైనా, ఆర్థికంగా ఎదుగుతున్నా అగ్రవర్ణాల వారు కళ్లుకుట్టుకుంటున్నారు. తెగబడి దాడులు చేస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘గుజరాత్ మాడల్’ అంటూ గొప్పగా చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలోనే దళితులు అభద్రతాభావం మధ్య బతుకులు వెళ్లదీస్తున్నారు. మంచిదుస్తులు ధరించి, కంటికి చలువ కళ్లద్దాలు పెట్టుకున్నాడన్న కారణంతో ఓ దళిత యువకుడిని ‘రాజ్పుత్’ సామాజిక వర్గానికి చెందిన కొందరు దాడిచేసి చితకబాదారు. ఇటీవల బాంబే ఐఐటీ విద్యార్థి ఆత్మహత్యకు కూడా కులవివక్షే కారణమని తేలింది.
గుజరాత్లోని బనస్కాంత జిల్లా మోతా గ్రామానికి చెందిన ఓ దళిత యువకుడు మంగళవారం మంచి దుస్తులు ధరించి, సన్గ్లాసెస్ పెట్టుకుని ఇంటి ముందు నిల్చున్నాడు. అది చూసి ‘రాజ్పుత్’ యువకుడు అతడి వద్దకు వచ్చి.. ‘ఈ మధ్య బాగా ఎదుగుతున్నావ్’ అంటూ చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి గ్రామంలోని ఆలయం బయట నిల్చున్న యువకుడి వద్దకు వచ్చిన ఆరుగురు నిందితులు కర్రలతో అతడిపై దాడిచేస్తూ పక్కనే ఉన్న డెయిరీ పార్లర్ వెనక్కి ఈడ్చుకెళ్లి చావబాదారు. అది చూసి అడ్డొచ్చిన అతడి తల్లిపైనా దాడిచేశారు. ఆమె దుస్తులు చింపేసి చంపేస్తామని హెచ్చరించారు. బాధితుల ఫిర్యాదుతో మొత్తం ఏడుగురు నిందితులపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. బాధిత తల్లీకుమారుడు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ఐఐటీ బాంబేలో బీటెక్ (కెమికల్) ఫస్టియర్ చదువుతున్న అహ్మదాబాద్ విద్యార్థి దర్శన్ సోలంకి ఈ ఏడాది ఫిబ్రవరి 12న హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఈ కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. దర్శన్ ఆత్మహత్యకు కులవివక్షే కారణమని అతడి తల్లి పేర్కొన్నట్టు అందులో తెలిపారు. కొందరు విద్యార్థులు, ప్రొఫెసర్లు సహా 55 మంది సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు.