లక్నో : యూపీలోని సుల్తాన్పూర్లో శిక్షణ సందర్భంగా ఓ హెడ్ కానిస్టేబుల్ నిద్రిస్తూ పట్టుబడ్డాడు. డ్యూటీలో నిద్రించినందుకు వివరణ ఇవ్వాలని అతడిని అధికారులు కోరారు. అయితే హెడ్ కానిస్టేబుల్ అధికారులకు ఇచ్చిన క్లారిఫికేషన్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కానిస్టేబుల్ రాం షరీఫ్ యాదవ్ సోమవారం జరిగిన ట్రైనింగ్ సెషన్లో నిద్రపోయాడు.
सुल्तानपुर में ट्रेनिंग क्लास में सोते हुए पकड़े गए सिपाही से जब स्पष्टीकरण मांगा गया
तो जवाब गजब का था 😆😆😆 pic.twitter.com/qk0kdPOOH9— Varun SR Goyal (@varunmaddy) October 11, 2022
ఇది తీవ్రమైన నిర్లక్ష్యమని, డ్యూటీలో ఎందుకు నిద్రించావో చెప్పాలని అతడి కమాండర్ యాదవ్ను వివరణ కోరారు. క్లారిఫికేషన్ లెటర్లో యాదవ్ ప్రస్తావించిన అంశాలు అందరినీ షాక్కు గురిచేశాయి. లక్నో నుంచి తాను ట్రైనింగ్ కోసం పీటీసీ దాదుపూర్కు వెళ్లానని, ఈ క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పాడు. సరైన ఆహారం లభించకపోవడంతో కడుపు పూర్తిగా నిండలేదని చెప్పుకొచ్చాడు.
దాంతో మరుసటి రోజు ఉదయం 25 రోటీలను, ఒక ప్లేట్ రైస్, రెండు బౌల్స్ పప్పు, ఒక కప్పు కూరగాయలు తిన్నానని దాంతో తనకు నిద్ర ముంచుకొచ్చిందని తాపీగా లేఖలో రాసుకొచ్చాడు. తనను క్షమించాలని, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని యాదవ్ తన పై అధికారిని కోరాడు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హెడ్ కానిస్టేబుల్ వివరణపై నెటిజన్లు తలో రకంగా స్పందించారు.