కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం దీటుగా బదులిచ్చారు. యోగి ఆదిత్యానాధ్ యూపీ గబ్బర్ సింగ్ అని, యూపీలో మాట్లాడేందుకు ఎవరికీ ధైర్యం లేదని అన్నారు. విపక్ష నేతలను జైళ్లలో బంధిస్తున్న వారు బెంగాల్ హింస గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బెంగాల్లో హింసకు చోటులేదని, బెంగాలీలు ప్రపంచానికి శాంతిని బోధించారని మంత్రి హకీం గుర్తుచేశారు. యోగి ఆదిత్యానాధ్ తమ రాష్ట్రానికి వచ్చి పాలన గురించి తమ సీఎం మమతా బెనర్జీ నుంచి నేర్చుకోవాలని హితవు పలికారు. మీరు మతం పేరుతో ఎన్నికలకు వెళతారు..ఎన్కౌంటర్లు చేస్తారని దుయ్యబట్టారు. తాము అభివృద్ధి అంశాలే అజెండాగా ఎన్నికలకు వెళతామని టీఎంసీ నేత పేర్కొన్నారు.
కాగా బెంగాల్లో ఎన్నికల అనంతర హింసను ప్రస్తావించింనందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్కు బెంగాల్ విపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి ధన్యవాదాలు తెలిపారు. తమకు సంఘీభావంగా నిలిచినందుకు యోగికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. యూపీ అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి బదులిస్తూ బెంగాల్ హింసపై యోగి ఆదిత్యానాధ్ మాట్లాడారు. బెంగాల్ తరహాలో యూపీలో ఎన్నికల అనంతరం హింసాకాండ చోటుచేసుకోలేదని చెప్పుకొచ్చారు. ఇది యూపీలో శాంతిభద్రతల పరిస్ధితి ఎలా ఉందనేది వెల్లడిస్తుందని అన్నారు.