తిరువనంతపురం : ఓ కేరళ జంట తమ పెండ్లికి ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులను ఆహ్వానించింది. ఆహ్వాన పత్రిక ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నవంబర్ 10న వివాహ బంధంతో ఒక్కటైన రాహుల్, కార్తీక దంపతులు చేతి రాతతో భారత సైన్యానికి వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపారు.
మేము (రాహుల్, కార్తీక) నవంబర్ 10న వివాహం చేసుకుంటున్నాం..మీరు మనం దేశం పట్ల చూపుతున్న ప్రేమ, అంకితభావం, దేశభక్తికి మేం కృతజ్ఞులమై ఉంటామని ఆ లేఖలో వారు సైన్యాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. మా భద్రత కోసం మీరు చేస్తున్న సేవలకు తామెంతో రుణపడిఉన్నామని, మీవల్లే తాము సంతోషంగా పెండ్లి చేసుకోగలుగుతున్నామని లేఖలో రాసుకొచ్చారు. తామిద్దరి ప్రత్యేకమైన రోజున మీరు రావాలని ఆహ్వానిస్తున్నామని మీ ఆశీస్సులు మాకు కావాలని పేర్కొన్నారు. తమను కాపాడుతున్నందుకు థ్యాంక్యూ అంటూ వెడ్డింగ్ ఇన్విటేషన్లో రాసుకొచ్చారు.
ఇండియన్ ఆర్మీ ఆహ్వాన పత్రికను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ తమను పెండ్లికి ఆహ్వానించిన రాహుల్, కార్తీకకు కృతజ్ఞతలు..కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది. ఇన్స్టాగ్రాంలో వైరల్గా మారిన ఈ పోస్ట్పై యూజర్లు పెద్దసంఖ్యలో స్పందించారు. మన రియల్ హీరోలను పెండ్లికి ఆహ్వానించడం గొప్ప విషయమని ఓ యూజర్ పేర్కొనగా, దంపతుల నిర్ణయం గొప్పగా ఉందని మరో యూజర్ రాసుకొచ్చారు. మన రియల్ హీరోలకు జైహింద్ అని కొందరు యూజర్లు వ్యాఖ్యానించారు.