న్యూఢిల్లీ : గత వారంతో పోలిస్తే వైరస్ పునరుత్పాదక రేటు (ఆర్ వ్యాల్యూ) ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. కరోనా సోకిన వ్యక్తి నుంచి ఎంతమందికి ఇన్ఫెక్షన్ సంక్రమించవచ్చనే దాన్ని ఆర్ వ్యాల్యూగా పరిగణిస్తారు. ఆర్ వ్యాల్యూ ఒకటి లోపు పడిపోతే మహమ్మారి ఎండెమిక్ దశకు చేరుకున్నట్టు భావించవచ్చు.
భారత్లో ప్రస్తుతం సగటు ఆర్ వ్యాల్యూ 1.13గా ఉంది. ఇక ఢిల్లీలో కరోనా కేసులు వరుసగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలో ప్రతిరోజూ వెలుగుచూసే కరోనా కేసుల్లో 40 శాతం కేసులు ఢిల్లీ నుంచే నమోదవుతున్నాయి.
ఇక సోమవారం ఢిల్లీలో 1485 కేసులు బయటపడ్డాయి. ఇక దేశవ్యాప్తంగా 3157 కేసులు నమోదవగా యాక్టివ్ కేసుల సంఖ్య 19,500కు ఎగబాకింది. గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి 26 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 5,23,869కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 4.3 కోట్ల మంది పైగా వైరస్ బారినపడ్డారు.