Bipin Rawat : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని నీలగిరి కొండల్లో బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో రావత్తో పాటు ఆయన భార్య, ఏడుగురు ఆర్మీ అధికారులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఇందులో 11 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో కూనూరు ఎయిర్బేస్లోని విల్లింగ్టన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే గతంలోనూ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. 2015, ఫిబ్రవరి 3వ తేదీన బిపిన్ రావత్ నాగాలాండ్లోని దిమాపూర్ పర్యటనకు ఆర్మీ హెలికాప్టర్లో బయల్దేరారు. ఆ సమయంలో ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటన నుంచి రావత్తో పాటు ఇద్దరు పైలట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నాగాలాండ్ ప్రమాదం జరిగిన సమయంలో బిపిన్ రావత్ లెఫ్టినెంట్ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన క్షేమంగా బయటపడాలని పలువురు ప్రార్థిస్తున్నారు.