ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మరోసారి ఒకే వేదికను పంచుకున్నారు. గత పక్షం రోజుల్లో వారిద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం ఇది మూడోసారి. (Sharad Pawar, Ajit Share Stage) ఈ నేపథ్యంలో రాజకీయంగా ఇది చర్చకు దారి తీసింది. సోమవారం పూణెలోని సఖర్ సంకుల్ (షుగర్ కాంప్లెక్స్)లో జరిగిన సమావేశంలో శరద్ పవార్, అజిత్ పవార్ ఒకే వేదికపై ఆశీనులయ్యారు. వసంతదాదా షుగర్ ఇన్స్టిట్యూట్ అధికారులు కూడా హాజరయ్యారు.
కాగా, ఈ సమావేశం తర్వాత అజిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి, భూసారాన్ని మెరుగుపరచడానికి, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి ఏఐని ఉపయోగించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
మరోవైపు శరద్ పవార్, అజిత్ పవార్ తిరిగి దగ్గరవుతున్నట్లుగా గత కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వారాల్లో మూడోసారి శరద్ పవార్తో వేదిక పంచుకోవడం గురించి అజిత్ పవార్ను మీడియా అడిగింది. అయితే వేరే కోణంలో దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. తన కుమారుడు జై నిశ్చితార్థం తర్వాత మరో కార్యక్రమంలో తామిద్దరం కలిసినట్లు చెప్పారు. ఈ సమావేశాలకు రాజకీయ ప్రాముఖ్యత లేదని అన్నారు.