Lok Sabha Elections | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాజకీయ పార్టీలు హామీలు, గ్యారెంటీలతో హోరెత్తించనున్నాయి. అయితే ఓటర్లు మాత్రం దేశంలోని ప్రధాన సమస్యలు, ఆయా అంశాలపై పార్టీల వైఖరిని నిశితంగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికలపై ప్రభావం చూపే ప్రధాన అంశాలు, సమస్యలేమిటో పరిశీలిద్దాం.
దేశంలో ప్రధాన సమస్యలు నిరుద్యోగం, ధరల పెరుగుదల. ఈ దేశంలో ఉద్యోగాలు లేకపోవడం అతి పెద్ద సమస్య అని విపక్ష ఇండియా కూటమి ఆరోపిస్తున్నది. కానీ మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నదని, ఉద్యోగాలు పెరుగుతున్నాయని అధికార బీజేపీ చెప్తున్నది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతమయ్యాయి. బీజేపీకి అత్యధికంగా దాదాపు రూ.7,000 కోట్లు విరాళాలు వచ్చాయని వెల్లడైంది. ఈ బాండ్ల ద్వారా అవినీతి జరిగిందని, బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారం సరిగ్గా ఎన్నికల ముందు రావడంతో ప్రతిపక్షాల చేతికి ఓ అస్త్రం లభించినైట్లెంది.
ఎన్నికల్లో రైతు సంఘాల ఆందోళనలు బీజేపీకి తలనొప్పిగా మారవచ్చు. మోదీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాము అధికారం చేపడితే, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించే చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇస్తున్నాయి. అయితే పీఎం-కిసాన్ పథకం వల్ల రైతుల జీవితాలు మారాయని బీజేపీ ఊదరగొడుతున్నది. రైతు సంఘాల నేతలతో చర్చలు జరుపుతూ, వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది.
మోదీ ప్రభుత్వం సుపరిపాలనను అందించిందని, అభివృద్ధి వేగాన్ని పెంచిందని, భవిష్యత్తు కోసం దార్శనికతతో చర్యలు చేపడుతున్నదని బీజేపీ చెప్పుకుంటుండగా; ఈ పదేళ్ల పాలనా కాలంలో అనేక అన్యాయాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవస్థల కబ్జా, రాజ్యాంగంపై దాడి, ఆర్థిక అసమానతల పెరుగుదల వంటివాటిని ఉదాహరణలుగా చూపిస్తున్నది.
ఈ రెండిటిని తమ ఘనతగా బీజేపీ చెప్పుకుంటుండగా, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొచ్చింది. దీనిని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని బీజేపీ సంకేతాలు పంపించింది. తాము ఎన్నికల ప్రణాళికలో చెప్పినదే చేస్తామని మోదీ ప్రభుత్వం గట్టిగా చెప్తున్నది. అయితే ఈ చర్యలన్నీ ఐకమత్యాన్ని దెబ్బతీసేవేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
జనవరి 22న అయోధ్య రామాలయంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనతను బీజేపీ తన ఖాతాలో వేసుకుంటున్నది. ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 500 సంవత్సరాల కలను మోదీ సాకారం చేశారని బీజేపీ ప్రచారం చేసుకుంటున్నది. కాంగ్రెస్, పలు ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ప్రధాన మంత్రి మోదీ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి, తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఈసారి లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విమర్శను మోదీ ఉపయోగించుకుంటున్నారు. మోదీకి కుటుంబం లేదని లాలూ వ్యాఖ్యానించడంతో, ‘మోదీ కుటుంబం’ అనే నినాదాన్ని మోదీ అందుకున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు తాము ‘మోదీ కుటుంబం’ అని సామాజిక మాధ్యమాల్లో చెప్పుకుంటున్నారు. మోదీ కూడా బహిరంగ సభల్లో మాట్లాడుతూ, ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులేనని చెప్తున్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తుండగా, ఆ పార్టీ 5 న్యాయ గ్యారంటీలను ప్రకటించింది. యువత, రైతులు, కార్మికులు, మహిళలకు న్యాయం చేస్తామని, భాగస్వామ్య న్యాయాన్ని అందజేస్తామని చెప్పింది.
ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ల భావజాలాలు ఈ ఎన్నికల్లో చర్చకు వస్తున్నాయి. ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నేతలు సనాతన ధర్మంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, సనాతన ధర్మానికి మద్దతుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. వేర్వేరు సిద్ధాంతాలు గల బీజేపీ, కాంగ్రెస్ తమ భావజాలాలను ఈసారి ఎన్నికల్లో ప్రజల ముందు ఉంచుతాయి.