(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ ఆర్థికం ఆగమాగమైంది. మొన్నటికి మొన్న అతిపెద్ద ఎకానమీల్లో టాప్-5 జాబితాలో నుంచి దిగజారి ఆరో స్థానానికి పడిపోయిన భారత్.. తాజాగా తలసరి ఆదాయంలోనూ నేలచూపులే చూస్తున్నట్టు తేలింది. రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో నిత్యం కొట్టుమిట్టాడే పొరుగు దేశం బంగ్లాదేశ్ మనకంటే తలసరిలో ఎంతో మెరుగ్గా ఉండటం గమనార్హం. ఈ మేరకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా అంచనాల్లో వెల్లడైంది.
దేశ జీడీపీని ఆ దేశ జనాభాతో భాగించడం ద్వారా వచ్చే మొత్తాన్ని ఓ వ్యక్తి తలసరి ఆదాయంగా చెప్తారు. ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్-2026’ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 2,911 డాలర్ల (రూ.2.74 లక్షలు)కు చేరుతుందని అంచనా వేసింది. ఇదే సమయంలో భారతీయుల తలసరి ఆదాయం 2,812 డాలర్లు (రూ.2.65 లక్షలు)గా ఉండొచ్చని పేర్కొన్నది. అంటే ఒక్కో భారతీయుడి కంటే, బంగ్లాదేశ్ పౌరుడు సగటున రూ. 9 వేలను ఎక్కువగా సంపాదించగలడని నివేదికను బట్టి అర్థమవుతున్నది. ఇక, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు తలసరి ఆదాయం సుమారు 7,500 డాలర్లుగా ఉండగా, ప్రపంచ సగటు తలసరి 15,600 డాలర్లుగా (రూ. 14.69 లక్షలు) ఉన్నది. ఈ లెక్కన చూసుకొన్నప్పటికీ, ప్రపంచ తలసరి కంటే, భారత తలసరి 12,788 డాలర్లు (రూ. 12.04 లక్షలు) తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
తలసరిలోనే కాదు ఆర్థిక వ్యవస్థ పరిమాణంలోనూ (జీడీపీ) భారత్ ఒక ర్యాంకును కోల్పోయింది. ఐఎంఎఫ్ తాజా అంచనాల ప్రకారం.. 2025లో దేశ ఆర్థిక వ్యవస్థ విలువ 3.92 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇదే సమయంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ విలువ 4 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. దీంతో గతంలో భారత్ కంటే ఒక ర్యాంకు వెనుకంజలో ఉన్న బ్రిటన్.. ఇండియాను తోసిరాజని ఐదో స్థానానికి దూసుకెళ్లింది. 5వ ర్యాంకులో ఉండాల్సిన భారత్ 6వ స్థానానికి పరిమితమైంది. 2024లో జీడీపీ ర్యాంకింగ్లో భారత్ 5వ స్థానానికి రాగానే, అదంతా తమ ఘనతేనని ప్రచారం చేసుకొన్న మోదీ పరివారం.. ఇప్పుడు మాత్రం నోరు మెదపట్లేదు.