న్యూఢిల్లీ: రానున్న రెండు రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయని పేర్కొంది. పశ్చిమ గాల్పుల వల్ల ఏప్రిల్ 12 రాత్రి నుంచి పశ్చిమ హిమాలయ ప్రాంతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల వాయువ్య భారత్లోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని, తద్వారా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.
రానున్న ఐదు రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 10, 13, 14 తేదీల్లో అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 13, 14 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్లో, ఏప్రిల్ 10, 13, 14 తేదీల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏప్రిల్ 10న పశ్చిమ బెంగాల్, సిక్కింలో కూడా వర్షపాతం నమోదయ్యే సూచన ఉందని పేర్కొంది.
కాగా, దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, లక్షద్వీప్ ప్రాంతం, ఆంధ్ర ప్రదేశ్ కోస్తా తీరం, కోస్తా, దక్షిణ కర్ణాటకలో రానున్న ఐదు రోజులలో చెదురు మదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఏప్రిల్ 10న తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే ఏప్రిల్ 10,13, 14 తేదీల్లో కేరళలో, ఏప్రిల్ 11 న తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడిండించింది.
మరోవైపు ఏప్రిల్ 12-14 వరకు పశ్చిమ రాజస్థాన్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 10-11 వరకు పంజాబ్, హర్యానా, ఢిల్లీలలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన హీట్వేవ్ పరిస్థితులు ఉండవచ్చని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ తూర్పు, పడమర ప్రాంతాలు, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వేడిగాల్పులుంటాయని అంచనా వేసింది. అలాగే ఏప్రిల్ 10 నుండి 12 వరకు జార్ఖండ్లో హీట్ వేవ్ పరిస్థితులు, ఏప్రిల్ 10, 11 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ డివిజన్లో, ఏప్రిల్ 10న ఛత్తీస్గఢ్ మీదుగా వేడిగాల్పులు వీస్తాయని వివరించింది.