న్యూఢిల్లీ : రెండు నెలలుగా మణిపూర్ భగ్గుమంటున్నా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ వరకూ మౌనముద్ర దాల్చడం యావత్ దేశాన్నీ విస్మయపరిచింది. రెండు తెగల మధ్య వైరం మణిపూర్లో మంటలు రేపినా సాధారణ పరిస్ధితులు నెలకొనేలా చొరవ చూపడంలో డబుల్ ఇంజిన్ సర్కార్ విఫలమైంది. వంద మందికి పైగా మణిపూర్ హింసాకాండలో ప్రాణాలు కోల్పోగా మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అల్లర్లను అదుపు చేయడంలో కాషాయ సర్కార్ ఘోరంగా విఫలమైంది.
మణిపూర్ మంటలు చల్లారకుండానే మరో బీజేపీ పాలిత రాష్ట్రం హరియాణాలోనూ మత చిచ్చు అగ్గిరేపింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పరిస్ధితి చేయిదాటక ముందే అల్లర్లను కట్టడి చేయడంలో కాషాయ సర్కార్లకు కార్యాచరణ లోపించడం దురదృష్టకరం. ఇక హరియాణలో (Haryana Violence) ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇమాం సహా నలుగురు మరణించిన ఘటన కలకలం రేపింది. హరియాణాలోని నుహ్లో వీహెచ్పీ సోమవారం నిర్వహించిన ప్రదర్శన సందర్భంగా అల్లర్లు చెలరేగాయి. నుహ్లోని గోరఖ్నాధ్ ఆలయంపై అల్లరి మూకలు దాడి చేశాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఆలయ పూజారిపై దాడి చేసిన దుండగులు అక్కడున్న బైక్ను దగ్ధం చేశారు. ఆపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. నుహ్లో జరిగిన అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు మరణించగా గురుగ్రాంలో ఇమాంను కొందరు హత్య చేశారు. గురుగ్రాంలోని సెక్టార్ 56లో నిర్మాణం జరుగుతున్న మసీదు వద్ద ఇమాం సహా ఇద్దరు వ్యక్తులపై అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డాయి. ఇమాం మహ్మద్ సాద్, ఖుర్షీద్పై దుండగులు కర్రలతో దాడి చేశారు. దాడిలో మహ్మద్ సాద్ మరణించగా, ఖుర్షీద్ పరిస్ధితి విషమంగా ఉంది.
వీహెచ్పీ ప్రదర్శనను కొందరు అడ్డగించడంతో హరియాణాలోని నుహ్లో సోమవారం అల్లర్లు చెలరేగాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలతో పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పాటు అక్కడున్న కార్లను దగ్ధం చేశారు. నుహ్లో హింసాకాండ విషయం వ్యాప్తి చెందడంతో గురుగ్రాంలోని సోహ్న రోడ్డు వద్ద ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. కాగా నుహ్, సోహ్న పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్ధితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 13 కంపెనీల పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. ఫరీదాబాద్, పల్వాల్, గురుగ్రాం జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఆయా జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు.
Read More :