న్యూఢిల్లీ : అల్లోపతి, ఆధునిక వైద్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగ గురు రాందేవ్ బాబాపై ఇండియన్ మెడికల్ అసోసియేష్ (ఐఎంఏ) తీవ్రంగా విరుచుకుపడింది. కరోనా వ్యాక్సినేషన్ తో పాటు కరోనా చికిత్సా పద్ధతులపై గందరగోళం నెలకొనేలా వ్యవహరిస్తున్నందుకు రాందేవ్ ను ఐఎంఏ దేశ వ్యతిరేకిగా అభివర్ణించింది. రాందేవ్ బాబా అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరోగ్య విపత్కర పరిస్థితుల్లో ఐఎంఏ చూపిన చొరవను వివరిస్తూ దేశ ప్రజలకు లేఖ రాసింది.
కరోనా మహమ్మారితో దేశం సతమతమవుతున్న సమయంలో ఐఎంఏ నిర్మాణాత్మక పాత్రను పోషిస్తోందని వివరించింది. భారత ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఐఎంఏ కలిసి పనిచేస్తోందని లేఖలో ప్రస్తావించింది. జాతీయ వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు అన్నింటికీ ఐఎంఏ చిరకాలంగా మద్దతు ఇస్తోందని గుర్తుచేసింది.
కాగా కరోనా కట్టడిలో అల్లోపతి, ఆధునిక వైద్యం విఫలమయ్యాయని, వ్యాక్సిన్ తీసుకున్నా పది వేల మందికి పైగా డాక్టర్లు మరణించారని రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాందేవ్ పై దేశ ద్రోహం చట్టం కింద కఠిన చర్యలు చేపట్టాలని ఐఎంఏ డిమాండ్ చేయగా ఆయనపై ఉత్తరాఖండ్ ఐఎంఏ విభాగం పరువు నష్టం దావా వేసింది.