న్యూఢిల్లీ : అల్లోపతి, అల్లోపతి వైద్యంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్ బాబాపై పరువు నష్టం దావా అనంతరం ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. దేశద్రోహం ఆరోపణల కింద రాందేవ్ పై చర్యలు చేపట్టాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత పదివేల మంది మరణించారని రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు అసంబద్దమని పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై పతంజలి అధిపతి రాందేవ్ అసత్య ప్రచారం తక్షణమే నిలిపివేయాలని ఐఎంఏ కోరింది.
కాగా రాందేవ్ బాబా అల్లోపతిని ప్రశ్నిస్తూ విడుదల చేసిన 140 సెకండ్ల వ్యవధి కలిగిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది. కొవిడ్-19కు అల్లోపతి మందులు తీసుకుంటూ లక్షల మంది మరణించారని రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాందేవ్ వీడియోను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కు ఐఎంఏ నివేదించింది. గతంలోనూ ఆయన కేంద్ర మంత్రి సమక్షంలోనే అల్లోపతి వైద్యులను హంతకులుగా అభివర్ణించిన విషయాన్ని ప్రధానిక రాసిన లేఖలో ఐఎంఏ ప్రస్తావించింది. మరోవైపు రాందేవ్ చర్యలను పతంజలి సమర్ధించింది. ఎవరో పంపిన వాట్సాప్ మెసేజ్ నే రాందేవ్ చదివారని చెప్పుకొచ్చింది.