చెన్నై: సాధారణంగా పంద్రాగస్ట్ రోజున కుల, మతాలకు అతీతంగా ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆ అవకాశం కోసం చాలా మంది పోటీపడతారు. అయితే ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. తాను క్రిస్టియన్ అని, జాతీయ జెండా ఎగురవేయనని, జెండాకు వందనం కూడా చేయనని చెప్పింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భంగా ఈ ఏడాది స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ధర్మపురి జిల్లాలోని ప్రభుత్వ స్కూల్ ప్రధానోపాధ్యారాలు తమిళసెల్వి మాత్రం జాతీయ జెండా ఎగురవేసేందుకు నిరాకరించింది. తాను క్రిస్టియన్ అని, జాతీయ జెండా ఎగురవేయనని స్పష్టం చేసింది. అలాగే జాతీయ జెండాకు వందనం కూడా చేయనని చెప్పింది. ‘మేం దేవుడికి మాత్రమే నమస్కరిస్తాం, మరెవరికీ కాదు. జెండాను గౌరవిస్తాం కానీ దేవుడికి మాత్రమే నమస్కరిస్తాం. కాబట్టి, జెండాను ఎగురవేయమని అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయురాలిని కోరాను’ అని తెలిపింది.
మరోవైపు ప్రధానోపాధ్యాయురాలు తమిళసెల్వి ఈ ఏడాది రిటైర్ కానున్నది. దీంతో ఆమెతో జెండా ఎగురవేయించి సత్కరించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే జెండా ఎగురవేయడం నుంచి తప్పించుకునేందుకు ఆగస్ట్ 15న సిక్ లీవ్ పెట్టింది. ఆమె గత కొన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో జిల్లా విద్యాశాఖ ముఖ్య అధికారికి ఆమెపై ఫిర్యాదు అందింది.