భోపాల్: చిల్డ్రన్స్ హోమ్ను చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు అధికారులకు తెలిసింది. (Illegal Children’s Home) దీంతో రైడ్ చేసిన అధికారులు బాలల ఆశ్రమానికి సీల్ వేశారు. అందులో ఉంటున్న 25 మంది బాలికలను ప్రభుత్వ పిల్లల సంక్షేమ వసతి గృహానికి తరలించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ సంఘటన జరిగింది. విజయ్ నగర్లోని వాత్సల్యపురం బాలల ఆశ్రమంపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కలెక్టర్ ఆదేశాలతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, జిల్లా అధికారులు ఆ చిల్డ్రన్స్ హోమ్ను తనిఖీ చేశారు. నిర్వాహకులు లేకపోవడంతో సంబంధిత పత్రాల గురించి వాచ్మేన్ను అడిగినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా బాలల ఆశ్రమం నిర్వహిస్తున్నట్లు తెలిసిందన్నారు.
కాగా, ఆ చిల్డ్రన్స్ హోమ్కు సీల్ వేసినట్లు అధికారులు తెలిపారు. అక్కడున్న 12 ఏళ్లలోపు వయసున్న 25 మంది బాలికలను ప్రభుత్వ బాలల ఆశ్రమం, జీవన్ జ్యోతి బాలికల హోమ్కు తరలించినట్లు చెప్పారు. బాలల ఆశ్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. వారిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. మరోవైపు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పిల్లల ఆశ్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్ ఇటీవల అధికారులను ఆదేశించారు.