లూథియానా: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ ( Navjyot Singh Siddu ) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ పరిపాలనా తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. చన్నీ ముఖ్యమంత్రిగా నియమితులై కేవలం మూడు నెలలే అయినప్పటికీ.. ఈ తక్కువ సమయంలోనే గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలో ఈ మూడు నెలల్లో జరిగినన్ని పనులు.. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా ఉన్న నాలుగన్నరేండ్లలో కూడా జరుగలేదని సిద్ధూ ఎద్దేవా చేశారు. లూథియానాలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్గాంధీకి, ఆయన సోదరి ప్రియాంకాగాంధీకి నమ్మిన బంటులా ఉంటానని సిద్ధూ చెప్పారు. 2022లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం సీట్లు కేటాయించనున్నట్లు ప్రియాంక ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా పంజాబ్లో కూడా మహిళలకు 50 శాతం అసెంబ్లీ సీట్లను కేటాయించనున్నట్లు సిద్ధూ ప్రకటించారు.