IIT students : ఐఐటీ విద్యార్థులు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న క్రాస్ క్యాంపస్ మొబిలిటీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు దీనిపై ఐఐటీలు నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తాజా నిర్ణయం ప్రకారం.. ఇకపై ఐఐటీ విద్యార్థులు ఒక క్యాంపస్ నుంచి మరో ఐఐటీ క్యాంపస్లోకి వెళ్లి చదువుకోవచ్చు. అంటే విద్యార్థులు తమకు నచ్చిన ఐఐటీ సంస్థలో చదువుకునే వీలుంటుంది.
ఇప్పటివరకు నచ్చిన ఐఐటీలో చేరాలంటే అంత సులభం కాదు. జేఈఈలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మాత్రమే సీట్లు కేటాయించేవారు. ఎక్కడ సీటు వస్తే అక్కడే చదువుకోవాలి. కానీ, ఇకపై క్రాస్ క్యాంపస్ విధానం ద్వారా విద్యార్థులు ఒక సెమిస్టర్ను తమ ఐఐటీ క్యాంపస్ బయట.. మరేదైనా ఐఐటీ క్యాంపస్లో చదువుకోవచ్చు. తమ నివాస స్తలానికి దగ్గరగా, తమ సొంత రాష్ట్రంలో చదువుకునే వీలు కూడా దీని ద్వారా దొరుకుతుంది. దీనికి సంబంధించి ఐఐటీ క్యాంపస్లు అన్నీ ఇతర విద్యార్థుల్ని అనుమతిస్తాయి. అక్కడ తమ కోర్సును కొనసాగించవచ్చు. హాజరు, పరీక్షలు వంటి అంశాల్లో ఇకపై క్యాంపస్ల మధ్య సహకారం ఉంటుంది.
ఈ నిర్ణయం అమలైతే ఏదో ఒక ఐఐటీలో సీటు సంపాదిస్తే చాలు. నచ్చిన ఐఐటీలో కొంతకాలం చదువుకోవచ్చు. ఈ అంశంపై ఇప్పటికే అనేక ఐఐటీల డీన్లు చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇంకా కొన్ని అంశాల్లో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఈ నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు.